చిలకలూరిపేట: పట్టణంలో సిగరెట్ల విక్రయాలపై నెలకొన్న పరిస్థితి అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది. MRP మార్పుల పేరిట అధిక ధరలకు విక్రయా...
చిలకలూరిపేట: పట్టణంలో సిగరెట్ల విక్రయాలపై నెలకొన్న పరిస్థితి అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది. MRP మార్పుల పేరిట అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, అసలు ధరల పెంపు సరఫరా గొలుసులోఎక్కడప్రారంభమవుతోంది? అన్న అంశంపై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
స్థానిక రిటైల్ వ్యాపారుల వాదన ప్రకారం, హోల్సేల్ స్థాయిలోనే...
ప్యాకెట్కు MRP కంటే ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. “మాకు వచ్చిన ధర ఇదే. మేము కూడా కొంత లాభం కలిపి అమ్మక తప్పదు. ఇష్టమైతే కొనండి, లేదంటే మాకు సంబంధం లేదు,” అంటూ హోల్సేల్ వ్యాపారులు సమాధానం ఇస్తున్నారని పలువురు చిన్న కిరాణా దుకాణదారులు పేర్కొన్నారు.సిగరెట్లు వంటి వేగంగా తిరిగే వస్తువులు లేకపోతే కస్టమర్లు ఇతర దుకాణాలకు వెళ్లే ప్రమాదం ఉండటంతో, రిటైలర్లు పెరిగిన రేట్లకే సరుకును కొనుగోలు చేయక తప్పడం లేదని వారు తెలిపారు.
అనంతరం తమకు మిగిలే స్వల్ప..
లాభాన్ని కలిపి వినియోగదారునికి విక్రయించడం జరుగుతోందని వెల్లడించారు. ఈ విధంగా చివరకు అదనపు భారం సామాన్య ప్రజలపైనే పడుతోంది.ఇదిలా ఉండగా, కొంతమంది హోల్సేల్ వ్యాపారులు భారీ స్థాయిలో స్టాక్ కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారన్న సమాచారం కూడా వినిపిస్తోంది. కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో — ఈ కొనుగోళ్లు చట్టబద్ధ బిల్లులతోనే జరిగాయా? పన్నుల చెల్లింపులు సక్రమంగా ఉన్నాయా? అన్న అంశాలపై సంబంధిత శాఖలు సమగ్ర సమీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
సిగరెట్ల సరఫరా వ్యవస్థ....
సాధారణంగా తయారీదారు నుంచి డిస్ట్రిబ్యూటర్, అక్కడి నుంచి హోల్సేలర్, అనంతరం రిటైలర్ దశల్లో కొనసాగుతుంది. ఈ గొలుసులో అధికారికంగా ప్రకటించని ధరల మార్పులు చోటుచేసుకుంటే, అది పర్యవేక్షణ యంత్రాంగం దృష్టికి వెళ్లాలి. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయం జరగడం చట్టపరంగా అనుమతించబడదు.
ప్రస్తుతం “బాధ్యత ఎవరిది?” అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోవడం మార్కెట్లో అనిశ్చితి పెంచుతోంది. లీగల్ మెట్రాలజీ శాఖ ఎంఆర్పీ అమలుపై తనిఖీలు చేపట్టాలి. జిఎస్టి విభాగం భారీ లావాదేవీలను సమీక్షించాలి. రెవెన్యూ మరియు సివిల్ సప్లైస్ యంత్రాంగం గోదాముల స్టాక్ వివరాలను పరిశీలించాలి. సమన్వయంతో చర్యలు తీసుకున్నప్పుడే వాస్తవ పరిస్థితి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
కోట్ల రూపాయల వ్యాపారం.....
సాగుతుంటే లాభాలు కొందరికి చేరుతున్నాయేమో గానీ, అదనపు వసూళ్ల భారం మాత్రం వినియోగదారుడే భరిస్తున్నాడు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సంబంధిత శాఖలు తక్షణ విచారణ చేపట్టి సరఫరా గొలుసులోని అసమానతలను సరిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.
చిలకలూరిపేటలో నెలకొన్న ఈ పరిస్థితి కేవలం స్థానిక సమస్యగానే మిగిలిపోతుందా? లేక విస్తృత స్థాయిలో ఉన్న ధోరణికి సూచనా? అన్నది అధికారుల చర్యలపైనే ఆధారపడి ఉంది.
COMMENTS