•పట్టణాబివృద్ధి.. ప్రజా సమస్యలపై అధికారులు, కౌన్సిలర్లతో ప్రత్తిపాటి సమీక్ష. చిలకలూరిపేట: వేసవిలో ఎక్కడా తాగునీటి, విద్యుత్ సమస్...
•పట్టణాబివృద్ధి.. ప్రజా సమస్యలపై అధికారులు, కౌన్సిలర్లతో ప్రత్తిపాటి సమీక్ష.
చిలకలూరిపేట: వేసవిలో ఎక్కడా తాగునీటి, విద్యుత్ సమస్యలు తలెత్తడానికి వీల్లేదని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే బాధ్యులైన ప్రభుత్వ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.
పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యలపై చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, మాజీ కౌన్సిలర్లతో మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రత్తిపాటి సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే దురాలోచనను ఉపేక్షించను..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు సిబ్బంది పనితీరుపై ప్రజల నుంచి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, పద్ధతి మార్చుకుంటారని ఒకటిరెండు సార్లు చెప్పి చూశామని, వారి పనితీరులో మార్పురాలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా తమకు, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావచ్చనే దురాలోచన చేసేవారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రత్తిపాటి హెచ్చరించారు. వేసవిలో ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలైన తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుధ్య నిర్వహణలో యంత్రాంగం ఉత్తమ పనితీరు కనబరచాలని, సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ, క్షేత్రస్థాయి పరిశీలనతో సమస్య మూలాల్ని ముందే పసిగట్టి చక్కదిద్దాలని ప్రత్తిపాటి అధికారులు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు ఉత్పన్నమైతే స్థానిక లైన్ మెన్లే బాధ్యులవుతారని, కిందిస్థాయి సిబ్బందితో పనిచేయించడం చేతకాకుంటే ఉద్యోగాలు వదిలేయవచ్చని ప్రత్తిపాటి తేల్చిచెప్పారు. ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని సిబ్బంది అభిప్రాయబేధాలు వీడి, ఐక్యంగా పనిచేయాలని, ఇందులో ఎవరు హద్దులు మీరినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాతో పాటు, పారిశుధ్య నిర్వహణపైనా మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.
ప్రజల మెప్పుతోనే నిజమైన ఉద్యోగ సంతృప్తి.. ఉద్యోగ భద్రత..
మున్సిపాలిటీ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్ని ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలన్నారు. తాగునీటి సరఫరా, పారిశుధ్యం. విద్యుత్ సరఫరాల్లో ప్రజల నుంచి చిన్న ఫిర్యాదు వచ్చినా సహించేది లేదని ప్రత్తిపాటి తేల్చిచెప్పారు. ప్రజలు మెచ్చుకున్నప్పుడే ఏ ఉద్యోగికైనా నిజమైన ఉద్యోగ సంతృప్తి, భద్రత లభిస్తుంద న్నారు.
సమీక్ష సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నేతలు మద్దిబోయిన శివ, ముల్లా కరీముల్లా, కొత్త కోటేశ్వరరావు, షేక్ మస్తాన్ వలి, ఎమ్మార్వో హుస్సేన్, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, డిఇ అబ్దుల్ రహీమ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, శానిటరీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
COMMENTS