
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తనను బెదిరించారనంటూ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. ఆయన హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణకు అనుకూలంగా ఉద్యమాల్లో పాల్గొనకూడదని వైయస్ రాజశేఖర రెడ్డి హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు తనను పిలిపించి రాజకీయ జీవితం నాశనం చేస్తానని వైయస్ రాజశేఖర రెడ్డి బెదిరించారని ఆయన ఆరోపించారు. మంత్రులకు, నాయకులకు తాయిలాలు ఇచ్చి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వేలకోట్ల రూపాయలు దోచిపెట్టారని ఆయన ఆరోపించారు. వైయస్ జగన్ ఎప్పుడూ సచివాలయానికి గానీ ప్రభుత్వ కార్యాలయాలకు గానీ రాని మాట వాస్తవమేనని, వైయస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్, విజయమ్మ కలిసి ఫోన్లోనే రాయబారాలు సాగించారని ఆయన అన్నారు.
తెలంగాణకు వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బద్ధశత్రువులని ఆయన అన్నారు. జగన్ సెటిల్మెంట్లన్నీ విజయమ్మకు తెలుసునని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని ఆయన సూచించారు. వైయస్ జగన్పై మధుయాష్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.






Comments