
ప్రస్తుత ఉప ఎన్నికల్లో అన్ని చోట్లా కాంగ్రెస్ పార్టీ గెలుపొందితేనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆగస్టులోగా తెలంగాణ అంశంపై ఒక స్పష్టమైన ప్రకటన చేయించడమే కాకుండా, అసెంబ్లీలో రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ ఒక తీర్మానం కూడా చేయించి కేంద్రానికి పంపుతామన్నారు.
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా లగడపాటి ప్రజా హిత యాత్రను నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర కర్నూలుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేసీఆర్, జగన్ అరాచకాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. వీరిద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు.
అంతేకాకుండా, 18 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందితేనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందన్నారు. అలాగే, రాష్ట్రం సమైక్యంగా ఉండేలా అసెంబ్లీలో కూడా ఒక తీర్మానం చేయిస్తామని చెప్పారు. జగన్కు, కేసీఆర్కు ప్రజల కష్ట సుఖాలతో పని లేదన్నారు. వారిద్దరికి కావాల్సింది ప్రజలను, ప్రజల ఆస్తులను లూఠీ చేయడమేనని లగడపాటి ఆరోపించారు.






Comments